
‘దైవం మానుష రూపేణా ‘ అన్నారు. ఈ మాటకు సరైన ప్రతిరూపం డాక్టర్ ఏ.ఎస్.రావు. తన పేరిట నిర్మించిన కాలనీకి సికింద్రాబాద్ నుంచి టికెట్ కొనుక్కొని బస్సులో వెళ్లిన మాన్యుడు ఆయన. ఆ మహనీయుణ్ణి స్ఫూర్తిగా తీసుకొని
ఈసిఐఎల్ ఉద్యోగులు నిర్మించుకున్న గృహసముదాయ కాలనీ ఏ.ఎస్.రావు నగర్ ఇప్పుడు స్వర్ణోత్సవం జరుపుకుంటోంది. ఆయన దార్శనికతలో అభివృద్ధి చెందిన ఈసిఐఎల్ ఎలక్ట్రానిక్స్ రంగంలో ఏర్పాటు చేసిన మొట్టమొదటి ప్రభుత్వరంగ సంస్థ. దేశ అణు , రక్షణ , రోదసీ రంగాలకు తోడ్పడటం ఈ సంస్థ ఏర్పాటులో ప్రధాన లక్ష్యంతో 1967లో ఏర్పాటైంది. లక్షలాది మందికి బంగారు భవిష్యత్తును అందించింది ఈసిఐఎల్. మొదట సనత్ నగర్ పారిశ్రామిక వాడలో ఏర్పాటై తరువాత శివారు ప్రాంతానికి తరలించారు. అప్పుడు శివారులో ఉన్న కంపెనీకి రావడానికి ప్రత్యేక బస్సులు ఉండేవి. కాలక్రమేణా సంస్థ ఉద్యోగులు ఒక సొసైటీగా ఏర్పడి డాక్టర్ ఏ.ఎస్.రావు పట్ల గౌరవ సూచకంగా నివాస కాలనీని ఏర్పాటు చేసుకొని ఇళ్ళు కట్టుకున్నారు.
సొసైటీ ఏర్పడి యాభై ఏళ్ళు పూర్తయిన సందర్బంగా సోమవారం మార్చి రెండవ తేదీన స్వర్ణోత్సవాలు జరుపుకుంటున్నారు. డాక్టర్ ఏ ఎస్ రావు నగర్ నివాసుల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ కార్యక్రమానికి స్పెషల్ ఆఫీసర్
కె. ఈశ్వరయ్య ప్రత్యేక ఆహ్వానితులుగా హాజరవుతున్నారు. ముఖ్య అతిధి పోలీసు ఇనస్పెక్టరు ఎన్. రామ లక్ష్మణ రాజు. గౌరవ అతిథులు ఎస్. సోమశేఖర రెడ్డి , కొత్త రామారావు. డాక్టర్ ఏ ఎస్ రావు నగర్ లైబ్రరీ భవనంలో ఉదయం పది గంటలకు ఉత్సవం మొదలవుతుంది.




