“యత్ర నార్యన్తు పూజ్యన్తు రమంతే తత్ర దేవతా….” అన్నారు. స్త్రీలు ఎక్కడైతే పూజింపబడుతారో అక్కడ దేవతలు నివసిస్తారని అన్నారు ఓ రచయిత. అక్షరం భావానికి ప్రతిరూపం. అతివ జగతికి ఆధారం. సమస్త జీవరాశి అమ్మ ప్రేమ నుంచి తన ఉనికిని ప్రదర్శిస్తుంది. మహిళలు చూపే మమకారం పలు విధాలుగా ఉంటుంది. అమ్మగా, సోదరిగా, సహచరిగా, సఖిగా, భాగస్వామిగా, కూతురిగా, కోడలిగా ఇలా ఆత్మీయతను అందిస్తుంది. ప్రపంచంలో ప్రతి పురుషుడి విజయం వెనుక స్త్రీ నీడలా వెన్నంటి ఉంటుంది. అక్షరాలు అందించి జ్ఞానం ప్రసాదించే సరస్వతి, సిరిసంపదలు సమర్పించే శ్రీ లక్ష్మి, మంచిని రక్షించే శక్తి స్వరూపిణి పార్వతీదేవి వీరందరూ జగతికి ఆరాధ్యదైవాలు. ముగ్గురు దేవతలు త్రివేణి సంగమంలా కొలువై మనందరికీ జ్ఞానం, సంపద, ఆధ్యాత్మికత, వివేకం, వినయం, వాక్కు , సహనం ఇలా సప్త సౌందర్యాలను వరుసగా ఇస్తున్నారు.
ఇతిహాసాలలో సీత, సావిత్రి, అనసూయ, ద్రౌపది వంటి వారి గాథలు అందరికీ ఆదర్శంగా నిలిచాయి.సత్యభామ,దుర్గాదేవి వీరు సాహసానికి ప్రతిబింబాలుగా అవతరించారు. చరిత్రలో రుద్రమదేవి, ఝాన్సీ,మగువ మాంచాల వీరు వీరత్వానికి సంకేతాలు ఆధునిక కాలంలో ఇందిరా గాంధీ, కిరణ్ బేడీ , సరోజినీ నాయుడు, సుష్మాస్వరాజ్, జయలలిత, ఉమాభారతి మమతా బెనర్జీ రాజకీయ రంగంలో, పాలనా రంగంలో ప్రజలకు సేవలు అందించారు.
అధ్యాపకులుగా, వైద్యులుగా , ఇంజనీర్లుగా, రచయితలుగా, న్యాయమూర్తులుగా, కళాకారులుగా, శాస్త్రవేత్తలుగా, రోదసీ యాత్రికులుగా , పైలెట్లుగా రాణిస్తున్నారు. నాగరికత ఎంత ఎదిగినా మగువలపై అత్యాచారాలు, చిన్నారులపై దారుణాలు జరుగుతున్నాయి. మనిషిలో సంస్కారం ఇంకా వికసించాలి. స్త్రీలు అబలలు కాదు సబలలు అనే సత్యం అందరూ గుర్తించాలి.
జీవన గమనంలో పగలు, రేయిలా స్త్రీ పురుషులు ఇద్దరూ కీలకం. మహిళా దినోత్సవం సందర్బంగా మహిళాశక్తికి, నారీజనానికి నీరాజనం. మహిళలందరికీ శుభాకాంక్షలు.
— డి.వి.ఎస్.ఎస్.శర్మ, 99490 39175.

