శ్రీ పరాభవ ఉగాది 19న


గురువారం మార్చి 19వ తేదీన ఉగాది లేక యుగాది పండగ. ప్రతి సంవత్సరం చైత్ర
శుద్ధ పాడ్యమి రోజున ఉగాది జరుపుకుంటారు. మన దేశంలోని అనేక ప్రాంతాలలో
వసంత ఋతువు ప్రారంభం సందర్బంగా వివిధ పేర్లతో పండగ జరుపుకోవడం
ఆనవాయితీ. ఉత్తరాయణ, దక్షిణాయనములనబడే ఆయన ద్వయ సంయుతం ‘యుగం’ (సంవత్సరం) కాగా, ఆ యుగానికి అది యుగాది అయింది. అదే సంవత్సరాది -ఉగాది రెండు తెలుగు రాష్ట్రాలు
ఆంధ్ర ప్రదేశ్ , తెలంగాణలో ఉగాది అని కర్ణాటకలో యుగాది అని మహారాష్ట్రలో గుడిపడవా
అని తమిళనాడులో పుత్తాండు అని జరుపుకుంటారు. కొత్త తెలుగు సంవత్సరం ఉగాది రోజున
ప్రారంభమవుతుంది. తెలుగు సంవత్సరానికి మొదటి రోజు కావడం వల్ల తెలుగువారు సంవత్సరాది
అని కూడా పిలుస్తారు. చైత్ర శుద్ధ పాడ్యమి రోజున బ్రహ్మ దేవుడు సృష్టిని ప్రారంభించాడని నమ్ముతారు.
తీపి, చేదు, వగరు వంటి ఆరు రుచుల మిశ్రమం ఉగాది పచ్చడిని తయారు చేసి తింటారు.
బెల్లం, ఉప్పు ,వేప పువ్వు, చింతపండు, పచ్చి మామిడి, కారం కలగలిపి తయారుచేసేదే ఉగాది పచ్చడి.
కొత్త సంవత్సరంలో అన్ని అనుభవాలను ఎదుర్కొవాలన్నది ఈ పచ్చడి తినడంలో పరమార్ధం.

  యుగాదిని ఒక్కో ప్రాంతంలో ఒక్కో రకంగా జరుపుకుంటారు.  తెలుగు రాష్ట్రాలలో
ఇంటి గుమ్మాలను మామిడి తోరణాలతో అలంకరిస్తారు. కొత్త వస్త్రాలు, నగలు కొంటారు.
కవి సమ్మేళనాలు, పంచాంగ శ్రవణం ఉంటాయి. పంచాంగ శ్రవణం ద్వారా గ్రహాల గమనాన్ని
తెలుసుకుంటారు. పంచాంగం వినడం, పంచాంగం దానం చేయడం, దక్షిణ ఇవ్వడం
ఉగాది ప్రత్యేకత. కొన్ని ప్రాంతాలలో సాంస్కృతిక కార్యక్రమాలు కూడా నిర్వహిస్తారు.
తెలుగులో అరవై సంవత్సరాలు ఉంటాయి. మొత్తం అరవై సంవత్సరాలు పూర్తయితే
షష్ఠి పూర్తి అంటారు. ఉదాహరణకు కీలక నామ సంవత్సరంలో పుట్టిన వ్యక్తి మళ్ళీ కీలక
నామ సంవత్సరం వరకు జీవించి ఉన్నట్లయితే దానిని షష్ఠి పూర్తి అంటారు. ఇప్పుడు
విశ్వావసు పూర్తయి పరాభవ వస్తోంది. కొత్త సంవత్సరంలో సుఖ సంతోషాలు
వెల్లివిరియగలవని నమ్ముదాం.

Share it :

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *