

మనకి ఆషాడం అనగానే బోనాలు పండుగ గుర్తుకు వస్తుంది. అమ్మవారిని ఆరాధించడం మన సంప్రదాయం మన తెలుగు రాష్ట్రం తెలంగాణలో దశాబ్ధాలుగా బోనాల పండుగ నిర్వహించడం ఆనవాయితీ. ఆషాడంలో చినుకుల తడి ప్రారంభమయినప్పుడు పండుగ నడిచి వస్తుంది. మన సంప్రదాయాలకి ప్రతీకలు ఈ వేడుకలు. తెలంగాణ ప్రభుత్వం బోనాలను రాష్ట్ర పండుగగా నిర్వహిస్తుంది.
వందలాది సంవత్సరాలుగా వేడుక నిర్వహిస్తున్నా సోషల్ మీడియా కారణంగా మన ఉత్సవాలు అందరికి చేరువ గావడం హర్షదాయకం. టివి ఛానల్స్, దినపత్రికలు, యూట్యూబ్ వంటి సాధనాలు ద్వారా ప్రపంచాన్ని పలకరాస్తుండటం విశేషం.
బోనాల పండుగ అమ్మపై భక్తుల ప్రేమని, విశ్వాసాన్ని వ్యక్తీకరిస్తుంది. దైవాన్ని బలంగా ఎవరునమ్మినా వారిని దైవం రక్షిస్తుంది. ఒకసారి కలరా, మశూచి వ్యాధులు వచ్చినప్పుడు, ప్రజలందరిని అమ్మవారు రక్షించింది. ఉజ్జయిని నుంచి వచ్చిన ‘మహంకాళి’ అమ్మవారికి కృతజ్ఞతలు తెలిపే వేడుక. ఒక తరం నుంచి పరంపరగా అన్ని తరాలు వారికి కొనసాగడం మానవత విలువలుకి సంకేతం. సైనికుల చేత ప్రారంభించిన ఈ ఉత్సవం జంటనగరాలలో నిరంతరం, చిరంతరం సజీవంగా నిర్వహించడం ఆనందకరమైన విషయం.
ఆషాఢ మాసంలో బోనాల వేడుక భావసమైక్యతకి ప్రతీక వంటిది. అమ్మవారికి కానుకలు సమర్పించడం, మహిళలు అందంగా అలకరించిన పాలు, బియ్యం, బెల్లంతో వండిన అన్నాన్ని ప్రసాదంగా అమ్మవారికి సమర్పిస్తారు. బోనాలు కుండని విశేషంగా ప్రతీ ఒక్కరు తన్మయత్వంగా సమర్పిస్తారు. మట్టి కుండ అయినా, వెండి, ఇత్తడితో చేసిన బిందెఅయినా సహృదయ భక్తి నివేదనని మనం సందర్శిస్తాం. సినీతారలు, రాజకీయ నాయకులు, అన్ని తరగతుల వారు ఈ వేడుకల్లో పాల్గొంటారు.
====== తెలంగాణ బోనాలు 2026 ఉత్సవాలు ఆషాఢ మాసంలో అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. జూలై 16న గోల్కొండ కోటలో అమ్మవారికి సమర్పించిన తొలి బోనంతో ఈ ఉత్సవాలు ప్రారంభమయ్యాయి.ముఖ్యమైన తేదీల వివరాలు: జూలై 16 – 17: గోల్కొండ శ్రీ జగదాంబ మహంకాళి ఆలయంలో బోనాలు . జూలై 26: బల్కంపేట ఎల్లమ్మ ఆలయంలో బోనాలు ఆగస్టు 2: (లష్కర్ ) సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి బోనాలు ఆగస్టు 9: లాల్ దర్వాజా సింహవాహిని మహంకాళి బోనాలతో పాటు పాతబస్తీలో ప్రధాన ఉత్సవాలు ఆగస్టు 10: రంగం (భవిష్యవాణి) , గజవాహన ఊరేగింపు జరుగుతుంది. బోనాల ముగింపు సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా ఆగస్టు 10న సాధారణ సెలవు దినం . ========
ఆషాఢ మాసంలో మొదటి ఆదివారం మొదలయ్యే సందడి నెల రోజుల పాటు కొనసాగుతుంది. గోల్కొండ నుంచి ఉజ్జయిని మహాంకాళి సికింద్రాబాద్ వరకు భక్తి భావపరంపర ప్రతీ ఆదివారం బోనాలు పండుగ ఉత్సవాల ప్రాముఖ్యంగా వుంటాయి. పోతరాజు, రంగం రోజున భవిష్యత్ వాణి చెప్పడం బోనాల పండగ ప్రత్యేకతలు.
భాగ్యనగర వీధులన్నీ బోనాలు పండుగకి సంబరంగా సిద్ధమవుతాయి. నిజంగా జగన్మాతని ఎవ్వరు ఏ రూపంలో ఆరాధించినా అమ్మవారి కరుణ అందరిపైన ఉంటుంది. తెలుగునాట శాకంబరి ఉత్సవం అయినా, బోనాలు అయినా, నవరాత్రి ఉత్సవం అయినా, అందరూ అమ్మ అనుగ్రహం కోసం ప్రార్ధిస్తారు.
––డా. దువ్వూరి సుబ్రహ్మణ్య శర్మ,
పరిశోధకులు, సెల్ : 9949039175




